సికింద్రాబాద్/హైదరాబాద్సిటీ, వెలుగు : దీపావళి, ఛత్ పండుగల సందర్భంగా ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 26 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు కాచిగూడ – నిజాముద్దీన్, నాందేడ్ – -పానిపట్, నాందేడ్ – -పాట్నా, ఛాప్రా– -యశ్వంత్పూర్, చెన్నై – అంబాలా కంటోన్మెంట్ మార్గాల్లో నడుస్తాయని పేర్కొన్నారు. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 20 వరకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయన్నారు. రెండు పండుగల సందర్భంగా హైదరాబాద్ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రత్యేక రైళ్లను నడపడంతో పాటు పలు ప్రధాన రైల్వే స్టేషన్లలో 14 అదనపు కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి తదితర స్టేషన్లలో అదనపు సిబ్బందిని నియమించామని తెలిపారు.
